33
యాకోబు ఏశావు కలుసుకున్నారు
1
యాకోబు కళ్ళెత్తి చూసినప్పుడు ఏశావు, అతనితో నాలుగువందల మంది మనుషులు వస్తూ ఉన్నారు.
2
అప్పుడు అతడు తన పిల్లలను లేయా, రాహేలులకు, ఇద్దరు దాసీలకు అప్పగించాడు. అతడు ముందు దాసీలనూ వారి పిల్లలనూ, వారి వెనక లేయానూ ఆమె పిల్లలనూ, ఆ వెనక రాహేలునూ యోసేపునూ ఉంచాడు.
3
తాను వారి ముందు వెళ్తూ తన సోదరుణ్ణి సమీపించే వరకూ ఏడు సార్లు నేలపై సాగిలపడ్డాడు.
4
అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కోడానికి పరుగెత్తి అతనిని కౌగలించుకుని అతని మెడను కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. వారిద్దరూ కన్నీళ్ళు పెట్టుకున్నారు.
5
ఏశావు ఆ స్త్రీలనూ పిల్లలనూ చూసి <<వీరు నీకేమౌతారు?>> అని అడిగాడు. అతడు <<వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే>> అని చెప్పాడు.
6
అప్పుడు ఆ దాసీలూ వారి పిల్లలూ దగ్గరికి వచ్చి ఏశావు ఎదుట సాగిలపడ్డారు.
7
లేయా ఆమె పిల్లలూ దగ్గరికి వచ్చి సాగిలపడ్డారు. ఆ తరువాత యోసేపూ రాహేలు దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు.
8
ఏశావు<<నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతా ఎందుకు?>> అని అడిగాడు. అతడు <<నా ప్రభువు దయ నా మీద కలగడానికే>> అని చెప్పాడు.
9
అప్పుడు ఏశావు <<తమ్ముడూ, నాకు కావలసినంత ఉంది, నీది నీవే ఉంచుకో>> అని చెప్పాడు.
10
అప్పుడు యాకోబు <<అలా కాదు, నీ అనుగ్రహం నా మీద ఉంటే దయచేసి ఈ కానుకను అంగీకరించు. దేవుని ముఖం చూసినట్టుగా నీ ముఖం చూశాను. నీ దయ నా మీద ఉంది కదా.
11
నేను నీ కోసం తెచ్చిన కానుకను దయచేసి అంగీకరించు. దేవుడు నన్ను కనికరించాడు. పైగా, నాకు కావలసినంత ఉంది>> అని చెప్పి అతన్ని బలవంతం చేశాడు కాబట్టి అతడు దాన్ని పుచ్చుకుని
12
<<మనం వెళదాం, నేను నీకు ముందుగా సాగిపోతాను>> అని చెప్పగా
13
అతడు <<నాదగ్గర ఉన్న పిల్లలు పసిపిల్లలనీ, గొర్రెలు, మేకలు, పశువులు పాలిచ్చేవి అని నా ప్రభువుకు తెలుసు. ఒక్క రోజే వాటిని వేగంగా తోలితే ఈ మంద అంతా చస్తుంది.
14
నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళాలి. నేను నా ప్రభువు దగ్గరికి శేయీరుకు వచ్చేవరకూ, ముందున్న మందలూ, ఈ పిల్లలూ నడవగలిగిన కొలదీ వాటిని మెల్లగా నడిపించుకుంటూ వస్తాను>> అని అతనితో చెప్పాడు.
15
అప్పుడు ఏశావు <<నీ కిష్టమైతే నా దగ్గర ఉన్న ఈ మనుషుల్లో కొందరిని నీ దగ్గర విడిచిపెడతాను>> అనగా అతడు <<అదెందుకు? నా ప్రభువు కటాక్షం నా మీద ఉంది. అది చాలు>> అన్నాడు.
16
ఆ రోజునే ఏశావు తన దారిలో శేయీరుకు తిరిగి వెళ్ళిపోయాడు.
17
అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమై వెళ్లి తమకొక ఇల్లు కట్టించుకుని తన పశువులకు పాకలు వేయించాడు. అందుకు ఆ చోటికి <<సుక్కోతు>> అనే పేరు వచ్చింది.
యాకోబు షెకెము చేరుకోవడం
18
ఆ విధంగా యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశంలో ఉన్న షెకెము అనే ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందు తన గుడారాలు వేశాడు.
19
అతడు గుడారాలు వేసిన పొలంలోని భాగాన్ని షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల దగ్గర నూరు వెండి నాణాలకు కొన్నాడు.
20
అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానికి <<
ఏల్ ఎలోహేయి ఇశ్రాయేలు>> అని పేరు పెట్టాడు.